AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Saturday, 22 February 2025

ప్రేమ దీర్ఘకాలము సహించును 1 సమూ 26:2, 7-9,12-13,22-23; 1 కొరింథి 15:45-49; లూకా 6:27-38 (7 C)

 

ప్రేమ దీర్ఘకాలము సహించును

 

1 సమూ 26:2, 7-9,12-13,22-23; 1 కొరింథి 15:45-49; లూకా 6:27-38 (7 C)

ఒకరు తన తల్లి గర్భం నుండి నగ్నంగా వస్తారు. నగ్నంగా మళ్ళీ వెళ్ళిపోతారు" (Divine Office)

 

క్రైస్తవులను ఇతర మతాల కంటే భిన్నంగా చూపించేది ఏది? అది దయ. ఇతరులను వారి అర్హతన   కాకుండా, దయకలిగి వారితో ప్రేమపూర్వకంగావ్యవహరించాలన్న దేవుని కోరుకను పాటించడంలో మన క్రైస్తవ్యం ఇతర మతాలకు చుక్కానిగా నిలుస్తుంది. “దేవుడు ప్రేమాస్వరూపి” (1 యోహాను 4:8,16). అన్యాయపరులకు మరియు నీతిమంతులకు ఒకే ప్రేమ ధర్మాన్ని చూపిస్తాడు దేవుడు. అతని ప్రేమ సాధువులను పాపులను సమానంగా ఆలింగనం చేసుకుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు తమకు రాజు కావాలని దేవునితో తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు వారికి రాజును ఇచ్చాడు (1 సమూ 8: 4-6). తన ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలు వ్యవహరించినప్పటికీ వారి మీద దేవునకు కలిగిన ప్రేమ వల్ల తనను తాను మానవ కుంచిత పరిస్థితులకు కుదించుకొని వారి జీవితాలకు సంతోషాన్ని కల్పించాడు. వారిని దేవుడు విడిచి పెట్టి ఉండవలసినదే! కానీ అది తన దయా ప్రేమ తత్త్వం. ఆదర్శం కానటువంటి అన్ని రకాల దీనదశల్లోనూ వారిని ఆశీర్వదించాడు భగవంతుడు. ఇటువంటి ఆదర్శమున తనను చంపడానికి ప్రయత్నిస్తున్న సౌలు రాజు చేతికి చిక్కినప్పుటికీ విడిచిపెట్టిన దావీదు, నిన్ను చంపడానికి నాకు చాలా కారణం ఉంది. నేను అలా చేయడం చాలా సులభం. కానీ దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకున్నందున నేను అలా చేయడం తప్పు" (1 సమూ 24:3) అని తన విధేయతా ధర్మాన్ని చాటుకున్నాడు దావీదు.


శిలువ నుండి యేసు తనను హింసించేవారిని, తండ్రి వారిని క్షమించండి ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు" (లూకా 23:34) అని క్షమించి ప్రార్ధించాడు. “తండ్రి కనికరం కలిగి ఉన్నట్లే మీరు కూడా కలిగి ఉండండి" (లూకా 6:36) అన్నది యేసు బోధన. దైవ ప్రేమకు అంకితం అయిన వాళ్ళు మాత్రమె ద్వేషపు దుర్మార్గ చక్రాన్ని ఖండించి ఆపగలరు. విశ్వాసం అనేది ప్రేమ ద్వారా వ్యక్తపరుపబడుతుంది (గలతీ 5:6) మరియు ఇతరులను ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడు (రోమా 13:8). ప్రేమ ధర్మశాస్త్రాన్ని పరిపూర్తి చేస్తుంది (రోమా 13:10). అలాగునే “నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు (గలతీ 5:14) అన్న ఒక్క ఆజ్ఞను పాటించడంలోనే సమస్త దైవ చట్టం నెరవేరుతుంది. క్రీస్తు ఆత్మను కలిగి మనిషి ఎదుగుదల మనుగడకు ఉపయోగపడని "నియమాలను" మనం విడనాడాలని భక్త పౌలుడు కోరుకుంటున్నాడు (రోమా 8:9).

 

మనందరికీ మన కన్నీటి కథలు చాలానే ఉన్నాయి! బహుశ: మనలో కొందరు మన జీవితాల్లో మన మీద జరిగిన అన్యాయ లేదా దురాక్రమణకు ప్రతిగా  ఒక మాస్టర్ ప్లాను వేసి గెలిచి నెరవేర్చడం ద్వారా సామాజిక నీతి స్పృహను మరియు చెడును మరింత చెడ్డ  పరిస్థితికి దిగజార్చి ఉండవచ్చు! మనం కలిగి ఉన్న పగ ఏపాటిది! మనం చనిపోయినప్పుడు, మనం ప్రేమించగలిగిన సామర్థ్యాన్ని మాత్రమే మనతో తీసుకెళ్లగలము. జైలు గది నుండి, పునీత థామస్ మోర్ తన కీర్తిని మరియు అతని జీవితాన్ని నాశనం చేసినందుకు హెన్రీ VIII అను రాజును క్షమించాడు. ఆనందానికి గొప్ప బహుమతి ద్వేషాన్ని తిరస్కరించడమే! భగవంతునితో ముడిపడిన వారు మాత్రమె శాంతిని పొందుతారు. క్రూరత్వం, ద్వేషం, దౌర్జన్యం, పగ అనే వాటి నుండి క్రీస్తు శిలువ మాత్రమే మనల్ని విడిపించగలదు. అది చెడును మంచితో తిరిగి ఇచ్చే ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి ప్రేమ మరియు దయ మనలను విధ్వంసం నుండి స్వస్థపరిచే, రక్షించే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే పౌలు మనకు "ఆశీర్వదించండి. శపించకండి లేదా పగ తీర్చుకోకండి మంచితో చెడును జయించండి" అని బోధిస్తాడు (రోమా 12:14,17,21).


కార్డినల్ న్యూమాన్, “ఓ యేసు! మేము వెళ్లిన ప్రతిచోటా మీ సువాసనను వ్యాపింపజేయడానికి మాకు సహాయం చేయండి. మీ ఆత్మ మరియు జీవంతో మా ఆత్మలను నింపండి. మా జీవితాలు మీ (...) ప్రకాశవంతంగా ఉండేలా, మా జివితాంత జీవిలో చొచ్చుకుపోండి మరియు దానిని స్వాధీనం చేసుకోండి. మేము సంప్రదించే లేదా తటస్థ పడే ప్రతి ఆత్మ వారి ఆత్మలో మీ ఉనికిని అనుభూతి చెందించు. మా  ద్వారా యేసు! ఇతరులపై మీ వెలుగు ప్రకాశింపజేయును గాక” అని తన ప్రతులలో వ్రాసుకున్నాడు. మన హృదయాలు దేవుని ప్రేమలో ఉన్నతమైనప్పుడు మాత్రమె మనం ఇతరులను ప్రేమించగలము, క్షమించగలము మరియు అంగీకరించగలము. యేసు ప్రేమ అనేది ‘మన తన’ అనే డిగ్రీ లేదా కేటగిరీ సరిహద్దులను లెక్కించదు. వాటికి భిన్నంగా అంగీకరించి ఆహ్వానించేదే మన యేసు ప్రేమ.

 

"మనము లోకములోనికి ఏమీ తీసుకురాలేదు. దాని నుండి ఏమీ తీసుకు పోలేము" (Divine Office)

 

Saturday, 15 February 2025

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును: యిర్మియా 17:5-8; 1 కొరింథి 15:12,16-20; లూకా 6:17,20-26 (6 సి)

 

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును

యిర్మియా 17:5-8; 1 కొరింథి 15:12,16-20; లూకా 6:17,20-26 (6 సి)

మనము దేవుని శక్తి అయిన సిలువపై క్రీస్తును ప్రకటిస్తున్నాము” (Divine Office)

 

లూకా సువార్తలో మనకు కన్పించే మైదాన ప్రసంగ ప్రారంభం మత్తయి 5:1-7,11 “పర్వత ప్రసంగం” వలె ఉంటుంది. సువార్త పఠనాల మధ్య ఈ శీర్షికలు కొద్ది పాటి సారూప్యతలను సూచిస్తున్నాయి. మత్తయి తన సువార్తలో వ్రాసిన ధన్య వచనాల కంటే లూకా తన సువార్తలో వ్రాసిన ధన్యవచనాలు చాలా వ్యక్తిగతమైనవిగా కన్పిస్తాయి. లూకా “మీరు” అనే సర్వనామం ఉపయోగిస్తుండగా మత్తయి “వారు” లేదా “అయిన వారు” అని ఉపయోగిస్తాడు. సంఖ్యలో కూడా తేడా కన్పిస్తుంది. మత్తయి ఎనిమిది ధన్య వచనాలను వివరిస్తే లూకా కేవలం నాలుగు సమాంతర ధన్య వచనాలను హెచ్చరికలతో కలిపి అందజేస్తాడు.

 

సువార్తలలొ మనకు కన్పించే ధన్య వచనాల రూపం యేసు స్వంత ప్రత్యేక బోధన కాదు. కీర్తనలు మరియు జ్ఞాన సాహిత్య గ్రంథాల వంటి పాత నిబంధనలో కూడా ఇటువంటి ధన్య వచనాలు కనిపిస్తాయి. ‘దుష్టుల ఆలోచనలు కాకుండా యెహోవా చట్టాన్ని అనుసరించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు’ అనే నేటి ప్రత్యుత్తర కీర్తన "రెండు మార్గాలు" అనే ఆలోచనను మనకు అందిస్తుంది. సామాజిక న్యాయం మరియు సమాంతర నిబద్ధత గురించి ప్రవక్తలు హెచ్చరించారు: “ఇంటికి మరొక ఇల్లు చేర్చి, పొలానికి మరొక పొలం చేర్చేవారికి అయ్యో, ప్రతిదీ వారికే చెందుతుంది! తెల్లవారుజాము నుండి మత్తు పానీయాల కోసం వెంబడించి, బ్రాందీలో తేలియాడుతూ రాత్రిపూట మెలకువగా ఉండేవారికి అయ్యో అనర్ధము! చెడును మంచిగా, మంచిని చెడుగా పిలచి వెలుగును చీకటిగా మార్చేవారికి అయ్యో!!  లంచం కోసం దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టి, మంచి వ్యక్తిని మోసం చేసేవారికి అయ్యయ్యో!!! (యేష 5:8-23).  ఇవన్నీ ప్రవక్తలు మొదట ప్రకటించినప్పుడు ఎంతో సందర్భోచితంగా ఉండేవి.


"రెండు మార్గాలు" - "మంచి మరియు చెడు" అనే భావన ఆదిమ క్రైస్తవ సంఘాన్ని లోతుగా ప్రభావితం చేసింది. యేసు ఆనంద మార్గం మారు మనస్సు లేదా అంతరంగిక పరివర్తనను కోరుతుంది. ఇది కేవలం పరిశుద్ధాత్మ క్రియ  ద్వారా మాత్రమె మనస్సులో మార్పు చేకూరుతుంది. పేదరికం, ఆకలి, దుఃఖం మరియు హింసలలో ఆనందాన్ని ఎలా పొందగలరు అనేది మనకు ఎదురయ్యే ప్రశ్న! మనం స్వర్గపు ఆనందంతో నింపబడాలంటే, హృదయాలలో దేవుణ్ణి మూసివేసిన లేదా కమ్మివేసిన సమస్త విషయాల నుండి మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. మిలాను ప్రాంతపు పునీత ఆంబ్రోసు ఒక ఆదిమ సంఘ పితృపాదులు. మన నైతిక శ్రేష్ఠతను బలపరిచే నాలుగు ప్రధాన ధర్మాలతో దీవెనలను అనుసంధానించాడు ఆంబ్రోసు. అవి నిగ్రహం, న్యాయం, వివేకం మరియు దృఢత్వం. ధన్యులైనవారు ఆత్మలో పేదవారు, విధేయులు మరియు ప్రశాంతంగా ఉంటారు. వారు తమ ఆస్తులను పేదలకు విరాళంగాఇచ్చి వేసుకుంటారు. వారు పొరుగువారిని కుట్ర పూరితమైన ముసుగులోనికి దించరు. ఈ ధర్మాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందువల్ల, నిగ్రహానికి హృదయం, ఆత్మకు స్వచ్ఛత, న్యాయానికి కరుణ, సహనానికి శాంతి మరియు ఓర్పులో సౌమ్యతను కలిగి ఉంటారు.

 

పేదల ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లుగా మరియు దాని పునరుద్ధరణను గురించి మనం ఎంత విరివిగా ఆశావాద వార్తలను సామాజిక మాధ్యమాలలో వినగలం, చెప్పండి? అభివృద్ధి చెందిన ప్రపంచంలోని ఆర్థిక వృద్ధి అందునా ఈ స్థూల ఆర్థిక వ్యవస్థ - వస్తు సంపద వినియోగంలో “రోబోటు”ల విచ్చల విడితనానికి మరియు మనిషికి కూలి కరవైన భవిష్యత్తుకు మధ్య అగాధాన్ని కప్పివేస్తుంది! రెచ్చగొట్టే వస్తు వినియోగదారుల వ్యవస్థ అన్నది కడుపు నిండని కష్టార్జితుల కన్నీళ్ళు వారి  అభద్రతతో విభేదిస్తుంది. పునీత రెండవ జాన్ పౌలు  దీనిని ఇలా ఖండించారు, "... దాదాపు స్వయంచాలకంగా వ్యవస్థ పని చేస్తుంది. కొందరికి సంపద మరికొందరికి పేదరికం అనే పరిస్థితులను మరింత కఠినతరం చేస్తుంది." అలాంటి పరిస్థితిని “చావైన పాపం” అని తన సువార్త ఆధారిత (ఎన్సైక్లల్)  “సొల్లిసితూదో రేయ్ సోసియాలిస్” (ది సోషల్ కన్సర్న్) అనే అధికారిక పత్రంలో  పేర్కొన్నాడు. నేటి మనిషి/మానవత్వ ఉనికిని కప్పివేసే కృత్రిమ మేథ (AI)ను ఖండించగలిగే ఆతని బోధనలు ప్రతిబింబిస్తున్నాయి. దేవుడు ఇచ్చిన తెలివితేటలను దుర్వినియోగం చేయడం ద్వారా నేటి కృత్రిమ మేథ (AI) ను దాని స్పృహ (కాన్షియస్నెస్) లోనికి తీసుకురావడం వంటి వస్తు సంపద దుర్వినియోగం లాంటి విషయాలు బాబేలు గోపురపు దుశ్చర్యలకు దేవుని ప్రతిచర్యను ప్రతిబింబించేలా చేస్తుంది, కదా!

 

పునీత రెండవ జాన్ పౌలు  తన “ఫిదేస్ ఎత్ రాత్సియో (ఫెయిత్ అండ్ రీసన్/ మతము మరియు సైన్సు) అన్న అధికారిక పత్రంలో విశ్వాసము లేదా మతము అన్నది అన్ని రకాల ఒంటరితనాన్ని దాటి ముందుకు వెళ్లడానికి కారణాన్ని లేదా సైన్సును ప్రేరేపిస్తుంది. అలివిగాని కష్టతరం అన్న సమస్యనుకూడా అధిగమించి మానవాళికి అందమైనది, మంచిదైనది మరియు నిజమైన దేనినైనా సాధించి ఇష్టపూర్వకంగా అమలు చేస్తుంది” అని వ్రాసారు. కాబట్టి ఆర్ధిక స్థూల వ్యవస్థలో వస్తు వినియోగం, మానవ జ్ఞాన/ విజ్ఞాన సంపత్తి వినియోగం - లోక, అధ్యాతిక దారిద్ర్య చీకటిని రూపు మాపడానికి, సర్వ మానవాళి మనుగడకు ధన్యమార్గ మవ్వాలి. యేసు భాగ్య వాక్యాలు పోలిమేరల్లోకి గెంటి  వేయబడి, అణగారిపోయి పగతో రగులుతున్నవారి శక్తిహీనత నుండి పుట్టలేదు కానీ అన్యాయపు అధర్మ  విజయాన్ని అనుమతించని దేవుని దీర్ఘ దృష్టి నుండి మాత్రమె పుట్టింది. యేసు మాట ధనవంతులకు మరియు పేదలకు నిర్ణయాత్మకమైనది! ఖండించడం మరియు ప్రోత్సహించడం అనే భాగ్య పదజాలం ఎప్పుడూ సజీవంగా ఉటుంది. అది మనందరి ముందు ఎప్పుడూ సవాలుగా నిలుస్తుంది!

 

ధన్యులైన విశ్వాసులు ప్రార్థనాపరులు. వారు తమ మూల వేళ్ళను భూగర్భ జలం అనే దేవునిలోనికి చొచ్చుకొని  విస్తరించుకునే వారుగా ఉంటారు (కీర్తన 1:1). వారు భగవంతునిపై ఆధారపడి ఉంటారు. నిర్మలంగా వుంటారు. దేవునిపై ఆధారపడటం అనేది వారి బలహీనతకు సంకేతం కాదు. అది వారిని ఎప్పటికీ అంతం లేని దేవుని శక్తి బంధంలో నిలబెడుతుంది. విజయవంతులను చేస్తుంది. ఆమేన్.

"...ఈ ప్రపంచం జ్ఞానంగా భావించేది దేవుని దృష్టిలో అర్ధంలేనిది" (Divine Office)


Saturday, 8 February 2025

దేవుని వలలో చిక్కిన వారు ధన్యులు: 6:1-2a,3-8; 1 కొరింథీ 15:1-11; లూకా 5:1-11 (5 C)

 

దేవుని వలలో చిక్కిన వారు ధన్యులు

6:1-2a,3-8; 1 కొరింథీ 15:1-11; లూకా 5:1-11 (5 C)

నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును? చిత్తగించుము. నేనున్నాను”


గెన్నేసరెతు సరస్సులో యేసు శిష్యుల చేపల వేట సారాంశం సారూప్య సువార్తలలో చెప్పబడింది. అయితే లూకా మాత్రమే పేతురును ఒక నమ్మదగ్గ శిష్యునిగానూ పాపిగానూ చూపించే సన్నివేశాన్ని   చిత్రించాడు. అసాధారణమైనన్ని చేపలను వలలో పట్టుకున్నప్పుడు పేతురు తన బలహీనతవు అయోగ్యతను గుర్తించిన్నట్లు లూకా వ్యక్త పరిచాడు. ఆ భావాన్ని “ప్రభూ, నన్ను విడిచిపెట్టు, ఎందుకంటే నేను పాపాత్ముడిని" (లూకా 5:8) అన్న మాటల్లో చూపించాడు. క్షమాపణా గుణశైలిని మరియు అంగీకార మనస్తత్వానికి అద్దం పట్టే సందేశాన్ని పాపులు బాగా అర్థం చేసుకుంటారననీ, అందువల్లనే యేసు తన సహవాసంలో పాపులను, అసమర్ధులను, అయోగ్యులను శిష్యులుగా స్వీకరించాడని లూకా తన సువార్తలో బయలు పరుస్తున్నాడు.

 

లియోన్స్ అను ప్రాంతపు పునీత ఇరేనియుడు పాపమునకున్న గుణాన్ని, దాని బోధనాపరమైన అంశాన్ని కనుగొన్నాడు. పాపపు స్వభావం దాని బలహీనతను గురించి తెలిసిన వారు తమ స్థితిని పురుగులాంటి జీవిగానూ మరియు ఆ జీవి కంటే సర్వ సృష్టికర్త మాత్రమె గొప్పవాడుగా గుర్తించగలరని తన బోధనలో చెప్పాడు. దేవుని ఉద్దేశ్యం ధర్మం లేదా యోగ్యతపై ఆధారపడి ఉండదు! పొరుగువారికి తన ప్రేమపూర్వక సేవలో పాలుపంచుకోవడానికి మనల్ని పిలిచే ముందు మనం యోగ్యులమా అని లేదా మన అర్హతను గుణించి గణించడు. దాని కోసం ఎదురు చూడడు యేసు! అది నిజమే! మన అనర్హత గుర్తింపు క్రీస్తు మన ద్వారా పనిచేయడానికి ఒక ప్రారంభాన్ని సృష్టిస్తుంది. పేతురువలే మనం కూడా యేసుతో కలిసి పనిచేయడానికి పిలువబడితే, ఈ లోక తుఫాను జలాల కెరటాల మధ్య గాయపడి వైద్యం చేసేవారిగా మనం బోధించే వాటిని ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తాము. సువార్త ప్రబోధనా ఫలాలను  అందించే ఒక మంచి సముద్ర వేట కోసం ప్రవాహాలకు వ్యతిరేకంగా ఈదడానికి ప్రయత్ని౦చ గలుగుతాము.

 

మనము కూడా దేవుని వలలో చిక్కుకోబడాలి. లోపాలతో కూడిన జీవితం, అంగీకార మనస్తత్వం,  నిరీక్షణ వాగ్దానాన్ని ఆ యేసు వలలో మాత్రమె చూడగలము. మత్తయి మరియు యోహాను సువార్తలు పేతురు వలలో వివిధ రకాల చేపలు పడినట్లు వివరిస్తున్నాయి. అలాగునే, నేడు యేసు  వల కంటే, వివిధ వినియోగదారులు (కన్స్యూమర్) మరియు వారి కృత్రిమ అవసరాల వలలు మనలను సులభంగా ఆకర్షిస్తున్నాయి. మానవ మరియు ఆధ్యాత్మిక విలువలకు విఘాతం కలిగించే విధంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థ, దాని బాహ్య భూటకపు ప్రలోభంపై ప్రత్యేక దృష్టి సారించే అవినీతి విజయం గురించి ఏమని ఆలోచించాలి? అలాగే, డ్రగ్స్ మరియు ఆల్కహాల్ సంస్కృతుల వల, మరియు జీవితపు అర్ధాన్ని కోల్పోతున్న వారి నిరాశ, ఆత్మహత్యల వల సంగతి ఏమిటి! పాపులను వెదకి వారిని క్షేమంగా పరలోక ఇంటికి చేర్చడానికి వచ్చిన యేసు మనస్సు మనకు గుర్తుకు రావాలి కదా? అతనికి వంద గొర్రెలు ఉంటే, ఒకటి తప్పుదారి పట్టినట్లయితే, అతను తొంభైతొమ్మిది౦టిని విడిచిపెట్టి తప్పిపోయిన దాని వెంట వెళ్ళేవాడు గదా! పరిశుద్ధ పోపు గారు ప్రకటించిన జూబ్లీ సంవత్సరానికి ఈ సందేశం ప్రధానమైనది కదా!!!

 

పాపిని వాని పాపమును మన వలతో పట్టుకోవడానికి మన బలం సరిపోదు. మనలను ఎన్నటికీ ఒంటరిగా విడిచిపెట్టని దేవుని వాక్యాన్ని విశ్వసించూదాం. పేతురు , బోధకుడా! మేము రాత్రంతా కష్టపడి ఏమీ పట్టుకోలేదు, కానీ మీ ఆజ్ఞ ప్రకారం నేను వలలు దించుతాను" (లూకా 5:5) అని అన్నాడు. నిజమే మన విర్క్తత్వ మరియు జీవితాంత ప్రకటన కష్టార్జితం సరిపోదేమో!! దయగల గుణదల లూర్దు మాత మనకు తన నిత్య సహాయాన్ని మన పరిచర్యలో అందిస్తుంది. కానాలో జరిగిన వివాహ వేడుకలో మరియ తల్లి మాటలు “ఆయన మీకు ఏది చెబితే అది చేయండి!” (యోహాను 2:5) అన్న ప్రోతాహిక మాటలు పేతురి ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మనము జీవించే, బోధించే సువార్త ప్రకటనానందానికి సాక్ష్యమిచ్చే విధానంగా మరయు మనలో క్రీస్తు వెలుగును పాపాత్ముడు చూడాలనే ప్రభు చిత్తం కోరుకున్న విధంగా నమ్మకంగా వుందాం.

 

ప్రభువు శిలువ మనకు జీవ వృక్షంగా మారింది” (Divine Office)

Saturday, 1 February 2025

నా కనులు నీ రక్షణను చూస్తున్నాయి: మలాకి 3:1–4; హెబ్రీ 2:14–18; లూకా 2:22-40 (4 C)


నా కనులు నీ రక్షణను చూస్తున్నాయి

మలాకి  3:1–4; హెబ్రీ 2:14–18; లూకా  2:22-40 (4  C)

“ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను” (నిర్గమ 13:1)

 

ఈ రోజు బాల యేసు సమర్పణ  పండుగను మాతృ శ్రీసభ ఘనపరుస్తుంది. క్రీస్తు జయంతి  40 రోజులు తర్వాత వచ్చే ఈ పండుగ గురించిన విషయాలను లూకా సువార్తలో మాత్రమే ప్రస్తావించబడినాయి. యూదుల శుద్ధీకరణ సంస్కారములను గురించి తెలియని నూతన క్రైస్తవుల కోసం తన సువార్తలో లూకా  వ్రాసాడు. యేరూశలేము ఆలయ పునఃనిర్నిర్మాణ సమయంలో, ఆ దేశంలో తాండవించిన ఆనాటి పేదరికం దేవుని బిడ్డలను బాగా నిరుత్సాహపరిచింది. అప్పుడు ప్రవక్త హగ్గయి దేవుని స్వరాన్ని ఇలా ప్రవచించాడు, “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యిష్టవస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును...ఈ కడవరి మందిర మహిమ మునుపటి మందిర మహిమను మించును. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు” (హగ్గయి  2:7, 9). 

 

బాల యేసు తల్లి దండ్రులు యెహోవా ఇచ్చిన చట్టం, “ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాది” అన్న చట్టాన్ని పరిపూర్తి చేశారు. ఆలయంలో బాల యేసును సమర్పించడంలో, హగ్గయి ప్రవచనం నెరవేరిందని మనకు సుస్పష్టమయింది. యేసు రాకతో ఆలయమంతా  దైవీక తేజస్సుతో నిండిపోయింది. సిమియోనుడు “ప్రభువు క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు” అని పరిశుద్ధాత్మచేత ఒక వరమును పొందుకున్నాడు. అందువలననే తల్లి దండ్రులైన మరియ యోసేపులు తమ అద్వితీయ కుమారుడు యేసును ఆలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు “ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను" (లూకా 2:26). అని లూకా వ్రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో, సిమియోను ఆలయంలోనికి వెళ్ళాడు. అతను లేవీయుడు కాదు, వాగ్గేయకారుడు కాదు లేదా న్యాయశాస్త్ర పండితుడు కాదు. అతను కేవలం "నీతిమంతుడు భక్తిపరుడు, ఇశ్రాయేలు ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నవాడు" మాత్రమె (లూకా 2:25)! పరిశుద్ధాత్మ తనకు నచ్చిన చోటుకు ప్రవహిస్తుంది (యోహాను 3:8). అతను ఇశ్రాయేలు ఇంటి మహిమను మరియు కొత్త ఇశ్రాయేలు అయిన సర్వలోక పీడనాన్ని చూశాడు. తల్లి  మరియ హస్తాలలో ఉన్న మహిమాన్విత శిశువు యేసును చూసినప్పుడు అతను కీర్తనకర్త మాటలను ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు, “మహిమ కలిగిన రాజు లోపలికి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి" (కీర్తన 24:7).

 

సిమియోను బాల యేసును తన చేతుల్లోకి తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు: “నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని నిష్క్రమింపనిమ్ము! అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని" (లూకా 2:29-32). ఈతని ప్రార్థన మాతృ శ్రీసభ రాత్రి కాల ప్రార్థన [Nunc dimittis (Divine Office)]లో భాగమయింది. తల్లి తండ్రులు, యేసును గూర్చి చెప్పబడిన విషయానికి చాలానే ఆశ్చర్యపడ్డారు! అప్పుడు సిమియోనుడు మరియ తల్లితో “నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొని పోవును” (లూకా 2:35) అని ప్రవచనం చెప్పాడు.

 

చీకటిని పారద్రోలడానికి, అతని వైభవంలో మనందరికీ భాగస్వామ్యం కల్పించడానికి నిజమైన వెలుగును పంపిన దేవునికి కృతజ్ఞతా గీతాన్ని సిమియోనుతో కలసి ఆనందిస్తూ ఆలపిద్దాం. పునీత సోఫ్రోనియసు  ఇలా అంటాడు, సిమియోనుని కనుల ద్వారా మాత్రమె కాకుండా మనం కూడా దేవుడు ఏర్పరిచిన లోక రక్షణను కనులారా చూస్తున్నాము. కొత్త ఇశ్రాయేలు అయిన మన కోసం సిద్ధం చేయబడిన యేసునందు మోక్షాన్ని ప్రతీ రోజు వాక్యమందును దివ్య సత్ర్పసాదమమందును అనుభూతి చెందుతున్నాము. సిమియోనుడు రక్షకుడు యేసును చూసినప్పుడు ఈ జీవిత బంధాల నుండి విడుదల పొందినట్లుగా, మనం కూడా దేవుణ్ణి మనలోనూ ఇతరుల్లోనూ చూడగలిగినప్పుడు మన భారాల నుండి విముక్తి పొందుతాము. ఎందుకంటే ఆత్మ ఘోషను దాని దాహాన్ని మనము ".. దేవునికొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది. నేను ఎప్పుడు దేవుడి ముఖాన్ని చూస్తాను? (కీర్త 42:2) అని వింటూనే ఉన్నాము. మనమందరం మరియ తల్లి బిడ్డలం కాబట్టి, యేసును దేవధి దేవునకు సమర్పించినట్లుగా మనలను కూడా తన చేతుల మీదుగా సర్వోన్నతుడైన దేవునకు సమర్పించమని ఆమెను కోరుకుందాం.

 

"మనం వెలిగించిన కొవ్వొత్తులు మన ఆత్మల దివ్య వైభవానికి సంకేతం" (Divine Office)

Saturday, 25 January 2025

విమోచకుడు: నెహే 8:2-4a,5-6,8-10; 1 కొరింథీ 12:12-30; లూకా 1:1-4; 4:14-21 ( 3 సి)

 

విమోచకుడు

నెహే 8:2-4a,5-6,8-10; 1 కొరింథీ 12:12-30; లూకా 1:1-4; 4:14-21 ( 3 సి)

".. ప్రతీ అర్చన వేడుక, యాజకుడు క్రీస్తు శరీర క్రియ. ఇది క్రీస్తు సంఘం" ( Divine Office)

 

 లూకా సువార్తకుడు తన సువార్త  ప్రారంభ వచనాలలో సువార ఉద్దేశ్యాన్ని చాలా చక్కగా స్థాపించాడు. అతని గ్రంథస్త శైలి మెరుగుపెట్టిన గ్రీకు మరియు రోమను సాహిత్యానికి విలక్షణమైనది. లూకా తన సువార్తను “థియోఫిలస్” (లూకా 1:3) అనే పేరుగల వ్యక్తికి వ్రాసి ఉండవచ్చు! ఈ  థియోఫిలస్” అనే వ్యక్తీ చరిత్రలో వున్నవాడా అనేది పరిశుద్ధ వేద పండితుల్లో నిలిచిపోయిన చాలా పెద్ద ప్రశ్న! నిజానికి గ్రీకు పదం “థియోఫిలస్” అంటే “దేవుని ప్రియమైనవాడు” అని అర్ధం. దీని అర్థం బట్టి చూస్తే ఆ “థియోఫిలస్” ఎవరో కాదు - అది “దేవుని ప్రియమైన వాడ”యిన నువ్వు నేను అని మన గ్రహింపుకు తెలుస్తుంది. కాబట్టి లూకా సువార్తికుడు దేవుణ్ణి ప్రేమించే మరియు ప్రేమించ ఆశ పడే వారందరికీ తన సువార్తను వ్రాస్తున్నాడు. నజరేయుడైన యేసును గురించిన "సత్యాన్ని తెలుసుకోవాలని" తన పాఠకులను (లూకా 1:4) కోరుకున్నాడు లూకా. యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు అతని వయస్సు దాదాపు 30 సంవత్సరాలు అని లూకా మనకు చెప్తున్నాడు (లూకా 3:23). యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం స్వీకరించిన వెంటనే (లూకా 3:21-22) సైతానుచే శోదించబడటానికి ఆత్మచేత (లూకా 4:1) అరణ్యంలోకి నడిపించబడినాడు (లూకా 4:1). ఆధ్యాత్మిక పరీక్షా కాలం ముగింపులో, యెషయా ప్రవక్త ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు తన బహిరంగ పరిచర్యను గలిలయలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు కూడా లూకా మనకు తెలియజేస్తున్నాడు (యేష 9:1,2).

 

మెస్సీయ "శుభవార్త"ను బోధిస్తాడనీ, అణచివేయబడిన వారందరికీ స్వస్థత మరియు స్వేచ్ఛను తీసుకోస్తాడని యెషయా ప్రవచించాడు (Is 61:1-2). తదనుగుణంగా, దేవుడు పంపిన మెస్సీయ తన “వ్యక్తి” లో నెరవేర్చిన ఆతని వాగ్దానాలపై వారి నిరీక్షణను మేల్కొల్పాడు. దేవుని ఆత్మ అనేది యేసును నడిపించే ప్రేరణగానూ, పేదల వద్దకు పంపించడం, అతని జీవితమంతా అవసరమైన, అణచివేయబడిన, అవమానించబడిన వారి వైపు మళ్లించడం. హిబ్రూ భాషన వీరందరిని ఒక్క మాటలో చెప్పాలంటే “అనావిం” అని చెప్పాలి. నేడు ఈ “అనావిం” మన మధ్యన చాలనే వున్నారు. "సువార్త" అనే పదానికి అక్షరాలా "శుభవార్త" అని అర్థం. ఈ రోజు దానిని అంగీకరించే వారందరికి  స్వేచ్ఛను మరియు మార్పు తీసుకురావడానికి ఇది సర్వశక్తిమంతమై, దయగలిగిన  జీవాన్ని ఇచ్చే శక్తిగా ఉంది.

 

"పేదలకు సువార్త బోధించబడినప్పుడు (లూకా 4,18), అది క్రీస్తు ఉనికికి సంకేతం"గా వుంటుంది (CCC 2443) అని మాతృ శ్రీసభ అర్థం చేసుకుంటుంది. తిరుసభ తాడిత పీడిత జనుల వైపు కొమ్ము కాస్తుంది. 'పేదల ఎంపిక' (ఆప్షన్ ఫర్ ది పువర్) అనే అంశాన్ని ద్వితీయ వాటికను మహా సభ కనుగొనలేదు. ఇది దేవుని ఎంపిక. అతను దానిని యేసు “భూలోక శరీర రోజుల్లో” తన  జీవితమంతా శ్వాసించాడు. నవ నవ్య వృద్ధి సాంకేతిక సమాజంలో దారిద్రియ రేఖన ఇంకా అణగారియున్న జనులను, సమాజంనుండి మినహాయింపబడిన వారిని రక్షించడానికి, వారికి మన సంఘీభావం తెలియచేయకపోతే, యేసుక్రీస్తువలె జీవించడం లేదా ఆతనిని  ప్రకటించడం అనేది అసలు సాధ్యమే కాదు. మన పోరు వారి పక్షాన లేకపోతె మనం ఏం సువార్తను ప్రకటిస్తున్నాము? మనం ఏ యేసును అనుసరిస్తున్నాము? ఈరోజు వివిధ రకాలైన వివక్షను ఎదుర్కొనేవారు, సమాజ పొలిమేర చూపులతో చూడబడి బాధపడేవారు యేసు విమోచకుడని అర్థం చేసుకొన శక్తిని వారికి ఇవ్వ లేకపోతే మనం ఏ ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తున్నాము? ఎటువంటి క్రీస్తు సంస్కరణలను వెలుగులోకి తెస్తున్నాము?

 

పునీత  పౌలుడు  ఇలా అంటాడు, "అవయవములు అనేకములైనను శరీరమొక్కటే. శరీరము ఏలాగున  అనేకమైన అవయవములను కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నదో...శరీరంలోని ఏదైనా అవయవం నాకు నీ అవసరం లేదు’ అని మరొకరితో చెప్పగలదా, ... ఒక అవయవం బాధపడితే, అందరూ కలిసి బాధపడతారు. ఒక సభ్యుడు గౌరవించబడినట్లయితే, అందరూ సంతోషిస్తారు” (1 కొరింథీ 12:20-23). ప్రభువైన యేసు నేడు మనలో ప్రతి ఒక్కరితో ఇలాగునే మాట్లాడుతున్నాడు. అతను మనకు స్వస్థత, పునరుద్ధరణ, క్షమాపణ మరియు పాపం, నిరాశ, నిస్సహాయత, విధ్వంసం, వివిధ రకాలైన అణచివేతల నుండి విముక్తిని తెస్తాడు. ప్రభువు తనను విశ్వసించి, తన కృపకు వాహినిగా మారడానికి ప్రయత్నించే మనందరిపై తన ఆత్మను కుమ్మరించడాన్ని ఎప్పటికి తిరస్కరించడు. సువార్త ఆనందాన్ని నమ్మకమైన విశ్వాసంతో, సంతోషకరమైన నిరీక్షణతో ఋజువర్తన ప్రేమతో ప్రతిరోజూ జీవించే స్వేచ్ఛను పునరుద్ధరించమని ప్రభువైన యేసును అడుగుదాం.

ప్రభూ, నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అల్లెలూయా” (Divine Office)