సయోధ్యలో న్యాయం
యెహె 33:7-9; రోమా 13:8-10; మత్త 18:15-20 (23/ C)
ప్రభువు తన
మాటలన్నిటిలో నమ్మదగినవాడును, తన కార్యములన్నిటిలో
ప్రేమగలవాడును. హల్లెలూయా.
“దేవుని
ఉద్దేశాలను ఎవరు తెలుసుకోగలరు?”
(జ్ఞానోపదేశకాండము 9:13). మానవ జ్ఞానం పరిమితమైనది. మనం తరచుగా ఒక
వ్యక్తి, ఒక సంఘటన లేదా ఒక వివాదపు కోణాన్ని
మాత్రమే చూస్తాము. దేవుడు ఆ వ్యక్తిని సంపూర్ణంగా చూస్తాడు. హృదయాంతరంగాన్ని పరిశిలిస్తాడు.
అందువల్ల, న్యాయానికి తీర్పు మాత్రమే కాకుండా
జ్ఞానం, సత్యం మరియు కరుణ సహితం అవసరం. నేటి
పఠనాలు మనల్ని తీర్పు నుండి సయోధ్యకు,
రాగ బంధాల నుండి
సంబంధానికి మరియు మానవ జ్ఞానం నుండి దేవుని జ్ఞానానికి మారమని ఆహ్వానిస్తున్నాయి.
ఒనేసిముసుడు కేవలం ఒక సామాజిక సమస్య
లేదా తన యజమాని వద్దకు తిరిగి వచ్చిన బానిస కాదు. పౌలు ఫిలేమోనును, అతడిని “ఇకపై బానిసగా కాక, బానిస కంటే ఎక్కువగా, ప్రియమైన సహోదరునిగా” స్వీకరించమని
కోరాడు (ఫిలేమోను 16). సయోధ్య కేవలం పాత సంబంధాన్ని
పునరుద్ధరించదు.
అది ఆ సంబంధాన్ని
రూపాంతరం చెందిస్తుంది. సయోధ్యలో న్యాయ సారాంశం అదే. సయోధ్య లేని న్యాయం
ప్రతీకారంగా మారవచ్చు. న్యాయం లేని సయోధ్య ఉపరితల శాంతిగా మారవచ్చు. క్రైస్తవ
సయోధ్య సత్యాన్ని, జవాబుదారీతనాన్ని, క్షమాపణను, పునరుద్ధరణను మరియు ఒక కొత్త సంబంధాన్ని
ఏకతాటిపైకి తెస్తుంది. గ్రీకు పదం καταλλαγή
(katallagē/ కతల్ల గే),
లేదా “సయోధ్య,” అనేది ఒక రాగబంధం నుండి మరొక సంబంధానికి
మార్పిడి, పునరుద్ధరణ లేదా మార్పు అనే అర్థాన్ని
కలిగి ఉంటుంది. అందువల్ల క్రైస్తవ సయోధ్య అనేది
“ఏమీ
జరగలేదు” అని చెప్పదు. అది,
“జరిగిన దానిని
సత్యంగా ఎదుర్కోవాలి.
కానీ అదే అంతిమ
నిర్ణయం కాకూడదు” అని చెబుతుంది.
సరైనది చేయకుండా మనల్ని ఆపే ప్రతి రాగబంధం
కన్నా దేవుణ్ణి, సత్యాన్ని అత్యున్నత స్థానంలో ఉంచాలని
యేసు మనల్ని కోరుతున్నాడు (లూకా 14:25–33).
ప్రతి వ్యక్తికి
చెందవలసినది ఇవ్వడమే న్యాయమని అరిస్టాటిల్ అర్థం చేసుకున్నాడు. కానీ యేసు న్యాయం, చెందవలసిన దానిని మాత్రమే కాకుండా, వ్యక్తిని మరియు మానవ సంబధాలను పునరుద్ధరించే
దానిని సహితం కోరుతుంది. ప్రతి వ్యక్తి గౌరవం గౌరవించబడే సమాజం వైపు న్యాయం మనల్ని
ఎలా నడిపించగలదు? అని యేసు అడుగుతాడు. శాంతి అంటే కేవలం సంఘర్షణ లేకపోవడం మాత్రమే
కాదని, అది "క్రమబద్ధమైన ప్రశాంతత"
అని పునీత అగస్టిను మనకు గుర్తుచేస్తున్నాడు. రాజకీయ విభజనలు, జాతి మరియు మతపరమైన ఉద్రిక్తతలు, యుద్ధాలు, కుటుంబ
కలహాలు, ఆర్థిక అసమానతలు, మతపరమైన అపార్థాలు మరియు సామాజిక
ధ్రువీకరణల మధ్య సహితం,
నిజమైన శాంతికి
దేవునితో, మనతో, ఒకరితో
ఒకరు మరియు సృష్టితో సరైన సంబంధాలు ఎంతో అవసరం. మనం ఇతరులకు సులభంగా నేటి
మార్కెట్లో ఉచితంగా దొరికే వివిధ రకాల మాటల ముద్రలు వేసేస్తాము. కానీ మనం వేసే ప్రతీ
ముద్ర వెనుక ఉన్న వ్యక్తిని చూడమని యేసు మనల్ని కోరుతున్నాడు. ఈ దివ్య
సత్ప్రసాదంలో సత్యాన్ని అన్వేషించే జ్ఞానాన్ని, న్యాయాన్ని
అనుసరించే ధైర్యాన్ని, మరియు క్షమించే వినయాన్ని దేవుడు మనకు
ప్రసాదించి, దేవుని రాజ్యానికి సాక్షిగా నిలబడేలా
చేయుగాక!!
ప్రభూ, నీ రాజ్యం
నిత్యరాజ్యం,
హల్లెలూయా.